నాసిక్ టీసీఎస్ వ్యవహారం వెనుక ఒవైసీ ఉన్నారు: రాజాసింగ్
- టీసీఎస్ కేసు ఒక భారీ కుట్ర అన్న రాజాసింగ్
- ఉగ్రమూలాలు ఉన్న అంశాల్లో ఎవరినీ వదిలిపెట్టకూడదని వ్యాఖ్య
- ఒవైసీతో దోస్తీ కొనసాగిస్తే రేవంత్ కెరీర్కు ముప్పు తప్పదని హెచ్చరిక
మహారాష్ట్రలోని నాసిక్ టీసీఎస్ కేసులో నిదాఖాన్ అరెస్ట్ తర్వాత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ కేసును కేవలం ఒక వ్యక్తిగత నేరంగా కాకుండా, ఒక భారీ కుట్రగా ఆయన అభివర్ణించారు.
నాసిక్ టీసీఎస్ కుట్ర వెనుక ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీతో పాటు మాజీ ఎంపీ ఇంతియాజ్ జలీల్ హస్తం ఉందని రాజాసింగ్ సంచలన ఆరోపణ చేశారు. దేశ భద్రతకు ముప్పు కలిగించే ఇలాంటి ఉగ్రవాద మూలాలున్న అంశాల్లో ఎవరినీ వదిలిపెట్టకూడదని ఆయన అన్నారు. వీరిద్దరినీ వెంటనే అరెస్ట్ చేసి విచారించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. దేశ భద్రత విషయంలో కఠినంగా వ్యవహరించాలని అన్నారు.
ఒవైసీ సోదరులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దోస్తీని కొనసాగిస్తే, ఆయన రాజకీయ కెరీర్కు ముప్పు తప్పదని హెచ్చరించారు. గతంలో ఒవైసీలతో సన్నిహితంగా ఉన్న నాయకులు ఎలా నష్టపోయారో గుర్తుంచుకోవాలని సూచించారు.
కేవలం ఇతర పార్టీలకే కాకుండా, బీజేపీ నేతలకు కూడా ఆయన ఒక స్పష్టమైన విజ్ఞప్తి చేశారు. ఎవరైనా బీజేపీ నేతలు ఒవైసీని రహస్యంగా కలిస్తే అది పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధమని, అలాంటి పనులకు దూరంగా ఉండాలని ఆయన కోరారు.